మన ఈ పవిత్ర భారతదేశంలో చాలా నదులు ఉన్నాయి. ఈ నదులు మన సంస్కృతిలో ఒక భాగం. మనం వాటిని నదులుగా పరిగణించము, వాటిని దేవతలుగా వ్యవహరిస్తాము. ఈ నదులలో స్నానం చేయడం పుణ్యప్రదమని నమ్ముతాము. పుష్కరాలు మరియు కార్తీక మాసంలో చాలా మంది ఈ నదులలో స్నానాలు చేస్తారు. మన జీవితంలో నదులకు చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి, నేను భారతదేశంలోని ప్రసిద్ధ నదుల గురించి కొంత సమాచారాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.
1. గంగా నది :-
గంగానది భారతదేశంలోను, బంగ్లాదేశ్లోను ప్రధానమైన నదులలో ఒకటి. "నీరు" అన్న పదానికి సంస్కృతంలో "గంగా" అన్న పదాన్ని వాడుతారు. గంగానదిని "గంగమ్మ తల్లి" అనీ, "పావన గంగ" అనీ, "గంగ భవాని" అని ఈ నదిని హిందువులు స్మరిస్తారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రం పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమానీనదం (Glacier) లో భాగీరథి నది ఉద్భవిస్తున్నది. ప్రవాహ మార్గంలో దేవప్రయాగ వద్ద అలకనంద నది దీనితో కలుస్తుంది. అక్కడి నుండి దీనిని "గంగా" అంటారు. కొంత దూరం హిమాలయాలలో ప్రహించిన ఈ నది హరిద్వారం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తుంది.
ప్రతి హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా గంగా నదిలో స్నానం చేయాలని కోరుకుంటారు. కాశీలోని గంగా నది ఒడ్డున తుది శ్వాస తీసుకోవడం ద్వారా వారు సులభంగా మోక్షం పొందుతారని ప్రజలు విశ్వసిస్తారు, కాబట్టి గతంలో చాలా మంది వృద్ధులు తమ చివరి రోజులు గడిపేందుకు కాశీకి వెళ్లి అక్కడే ఉండిపోయేవారు. గంగాజలం చాలా పవిత్రమైనది, దానిలోని మలినాలను దానంతటదే శుభ్రం చేయగలదని నిరూపించబడింది. ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే చెడిపోదు. కాశీని దర్శించినా, గంగాస్నానం చేసినా మనకు వచ్చే జన్మ ఉండదని పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు.
గంగా నది తీరాన కుంభ మేళ, ఛత్పూజ వంటి ఉత్సవాలు జరుగుతాయి. కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద జనసమూహం కూడుకొనే ఉత్సవం. వారణాసి హిందువులకు పరమ పవిత్ర స్థానం.
జనసాంద్రత అధికంగా ఉన్న ప్రదేశాలు గంగానదికి ఇరువైపులా ఉన్నందున, ఇప్పుడు ఈ పవిత్ర నది చాలా కలుషితమై ఉంది, ఈ నది తనంతట తాను శుభ్రం చేసుకోలేని విధంగా కలుషితం అవుతోంది, కాబట్టి మన ప్రభుత్వం "గంగా యాక్షన్ ప్లాన్" పేరుతో గంగా జలాన్ని శుద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది.